పంచతంత్ర కథలు --- జగన్నాథశర్మ ఎద్దు- సింహం స్నేహం ‘‘ప్రభూ’’ పిలిచాడు దమనకుడు.‘‘చెప్పు’’ కళ్ళు తెరిచాడు పింగళకుడు.‘‘ఇందాక తమరు యమునానది ఒడ్డున ఏదో ఆలోచిస్తూ నిలుచున్నారు. తర్వాత వెను తిరిగి వచ్చారు. వస్తూన్నప్పుడు మిమ్మల్ని చూశాను. అప్పుడు కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుగానే ఉన్నారు. ఏంటాలోచిస్తున్నారో సెలవిస్తారా?’’ పింగళకుణ్ణి ముగ్గులోకి దించే ప్రయత్నాన్ని ప్రారంభించాడు దమనకుడు.‘‘అదా...అదీ...నీలాంటి వాడికి చెప్పడంలో నామోషీ ఏముందిగాని, ఇందాకేదో పెద్ద శబ్దం వినిపించిందయ్యా. ఏ జంతువుదో పెద్ద కూత. అదే జంతువు అయి ఉంటుందో అంతు చిక్కలేదు. నాకు వినిపించేలా అంతగా కూత పెట్టిందంటే, అదేఁ తక్కువది కాదు. చాలా బలమయినదై ఉండాలి. పైగా ఎంత ధైర్యం లేకపోతే నా రాజ్యంలో నన్ను భయపెట్టేలా’’‘‘మిమ్మల్ని భయపెట్టడమా?’’ మధ్యలోనే మాట అందుకుని ఆశ్చర్యం నటించాడు దమనకుడు.‘‘భయపెట్టడం అంటే భయపెట్టడం కాదు, కాకపోతే నన్ను సవాల్ చేస్తున్నట్టుగా కూత పెట్టడం కొంచెం ఆలోచింప చేసింది.’’ అన్నాడు పింగళకుడు. తర్వాత తల విదిల్చాడు. నిద్రమత్తును పొగొట్టుకున్నాడు. ఇలా అన్నాడు. ‘‘నాకు తెలీయకుండా నా రాజ్యంలో కొత్త శత్రువు...