సాహసం,సమయస్ఫూర్తి ,పరమత సహనం,గెరిల్లా యుద్ధాలకు పెట్టింది పేరు..
"ఛత్రపతి శివాజీ "
■ "మీరు సిపాయి అయినా, సైనికాధికారి అయినా గ్రామస్తులకూ, రైతులకూ భారం కాకూడదు. గడ్డిపోచ కూడా వారి నుంచి గుంజుకోకూడదు. మీ అవసరాలకు రాజ భాండాగారం నుంచి నిధులు పంపిస్తున్నాం. ఎటువంటి అవసరాలున్నా ఆ డబ్బునే వాడండి. ఆహారంతోపాటు కూరగాయలు, వంట సామగ్రి, వంటచెరకు, చివరకు పశుగ్రాసం కూడా డబ్బులు చెల్లించే తీసు కోవాలి. బలవంతంగా లాక్కోగూడదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే రైతాంగం మనల్నందర్నీ దూషిస్తుంది. అర్థం చేసుకోండి. రైతాంగం, సామాన్య ప్రజలెవ్వరూ కూడా మన వల్ల ఇబ్బందులు పడకూడదు"...
మే19,1673న భవానీశంకర్ అనే సైనికాధికారికి ఛత్రపతి శివాజీ మహరాజ్ 'రాసిన లేఖ'లోని అంశాలివి.
■ శివాజీ... ఈ పేరు వినగానే పౌరుషాగ్ని గుర్తుకొచ్చి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీర శివాజీ అనే నినాదం మన చెవుల్లో మార్మోగుతున్నట్టుంటుంది. ఆ యన సాహసం, వీరత్వం, ధీర త్వం,సమయ స్ఫూర్తి, యుద్ధతం త్రం పుస్తకాల నిండా మనకు కనిపించేవే. ఆయన గెరిల్లా యుద్ధ తంత్రం చరిత్రలో మరపు రాని ఘట్టం.
■ వక్రీకరించిన చరిత్రకానీ, ఆయన పాలనా దక్షత, ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ, ఆర్థికా భివృద్ధికి వేసిన మార్గం, సామాజిక రంగంలో అందించిన సమాన గౌరవం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆయనను ఒక మతానికి వ్యతిరేకిగా, మరొక మతానికి, భారత ప్రజల మనోఫలకం మీద పడిన బలవంతపు ముద్ర–హిందూత్వం. అది ఎంతమాత్రం నిజం కాదని చరిత్రకారులు రుజువు చేశారు. ఆయన పాలన లోని ఎన్నో విషయాలు నేటికీ అనుసరణీయ మని పిస్తుంది. పైన పేర్కొన్న లేఖ అందులో భాగమే.
బాల్యం..
■ శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1630వ సం" వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతుల కు జన్మించాడు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది.
■ షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.
సామ్రాజ్య అంకురార్పణ.
■షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారా లను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగు నట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసు కొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.
సుల్తానులతో యుద్ధాలు..
■17ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటనుసొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్ఘడ్ కోటల ను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
■ శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.
ప్రతాప్ఘడ్ యుద్ధం..
■ శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాల యాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు.
■ అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ
ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు.అంత లో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారు లను, శివాజీ సైన్యాధికారులు అడ్డుకోనగా, శివాజీ తన దగ్గరన్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వలె చీల్చి చెందాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా, ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకివధిస్తాడు.
■ ఈ విజయంతో శివాజీ మరాఠాయోధుడి గా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగయినా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్థూన్ సైనికులను పంపించగా, శివాజీ సేన వేల సంఖ్యలో పస్థూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.
కొల్హాపూర్ యుద్ధం..
■ ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్
అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ ' అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు.తన మేనమామ షాయైస్త ఖాన్ ను శివాజీ పై యుద్ధానికి పంపాడు.
■ పవన్ఖిండ్ యుద్ధంలో 300 మంది
సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది.
■ ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది.
మొఘలులతో యుద్ధాలు..
షైస్తా ఖాన్ తో యుద్ధం..⚔
■ 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు.
■ ఎప్పటికయినా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమయిన భద్రతను ఏర్పాటు చేసాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలసి పెళ్ళికూతురు తరపున బంధువుల్లో కలసిపోయి లాల్ మహల్ చేరుకొన్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది.కాబట్టి, సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొన్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ మూడువేళ్ళు తెగి కింద పడగా, షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షైస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించివేసాడు.
సూరత్ యుద్ధం..⚔
■ 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమయిన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు.
■ ఇదిచూసిన ఔరంగజేబు
ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడయిన రాజా జై సింగ్ను శివాజీ పైకి పంపించాడు. రాజా జై సింగ్ సంగతి తెలిసిన శివాజి తాను యుద్ధంలో ఓడిపోవడం ఖాయమని తెలుసుకొని సంధికి ఒప్పుకున్నాడు. సంధిలో భాగంగా 23 కోటలను, 4,00,000 రూపాయలను మొఘలులకు చెల్లించాడు.
■ శివాజీ తాను కూడా ఒక మొఘల్ సర్దార్గా ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శతృవులయిన బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్గా ఉండడానికి ఒప్పుకున్నాడు.
ఆగ్రా కుట్ర..
■ 1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజి బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.
■ ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా, దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన.
■ అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీనుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.
సింహగఢ్ యుద్ధం..⚔
■ శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా, పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్భాన్ రాథోడ్ అనే రాజపుతృడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చెసుకొని బాధ్యత అప్పగించాడు.
■ తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు.
■ అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు. మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ 'కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము ' అన్నాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహఘడ్గా మార్చాడు.
శివాజీ పట్టాభిషేకము..
■ జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో
వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజు లందరికీఅధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణరాష్ట్రాల దండ
యాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు.
*■ 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.*
■ శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్నిచేపట్టి మొఘలులను సమర్థవంతం గా ఎదుర్కొని పరిపాలించాడు.
పరిపాలనా విధానం..
■ యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారత దేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్ఠమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.
వ్యక్తిత్వం...
■ సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి,స్త్రీలకు,పసివారికి సహాయంచేసాడు.
■ ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీముందు ప్రవేశ పెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు.
■ నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చ లేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజల కు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.
కోటలు...
■ మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోట లను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతిపొందాడు. నాసిక్ నుండి మద్రాసు
దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.
మతసామరస్యం.
■ శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు.కేవలం గుళ్ళు మాత్రమేకాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు.శివాజీ సైన్యం లో మూడొంతులు ముస్లిములు.ఎందరో ముస్లి ములు ఉన్నత పదవులు నిర్వహించారు.
●హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి,
●సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.
●శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు!
●శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే!
(ఫిబ్రవరి 19, 1630- ఏప్రిల్ 3, 1680)

Comments
Post a Comment