Skip to main content

మన భాష - తెలుగు !!

మన తెనుగు (తేనె+అగు) లేదా తెలుగు (తేనె+అలుగు) భాష వయస్సు దాదాపు 2000 సంవత్సరముల పైమాటే.11 వ శతాబ్దంలో నన్నయ తెలుగు వ్యాకరణం సమకూర్చి, సంస్కృతంలో వ్యాసుడు వ్రాసిన మహాభారతాన్ని, తెలుగు భాషలోకి అనువదించాడు. మహాభారతం మన మొదటి సాహిత్య పద్య గద్య ఇతిహాసం.

తెలుగు అజంత భాష. ప్రతి పదం అచ్చుతోనే ముగిసి పదానికి అందం తెస్తుంది. తేనె కన్నా తీయనిది తెనుగు భాష. తెలుగు భాష గొప్పదనమంతా అక్షరాల అల్లికలోనే వుంది. ఇంటి ముందు చక్కని ముగ్గును చూసినంత ఆనందం కలుగుతుంది. 

మొదట్లో 16 అచ్చులు, 3 విశేష అచ్చులు, 41 హల్లులు కలిపి 60 అక్షరాలుండేవి. కాలక్రమేణా, కొన్ని అక్షరాల వాడకం తగ్గి 56, 54, 52 గా పరిణమించాయి. ఇప్పుడు  12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరాలను మాత్రం వాడుతున్నాము. అరసున్న, విసర్గం వాడకం చాలా వరకు తగ్గిపోయింది. 

మన దేహానికంతా వ్యాయామ సౌకర్యం వుంది. ముఖానికి మాత్రం లేదు. తెలుగు అచ్చులు (అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అః) పలికే టప్పుడు, ముఖకదలికతో ముఖానికి మంచి వ్యాయామం చేకూరుతుంది. అలాగే హల్లుల వల్ల ముఖం అన్ని భాగాలకు, ఈ క్రింది విధంగా వ్యాయామం కలుగుతుంది.

                     క ఖ గ ఘ ఙ ......................... కంఠ భాగము

                     చ ఛ జ ఝ ఞ ......................నాలుక మొదటి భాగము

                     ట ఠ డ ఢ ణ ..........................నాలుక మధ్య భాగము

                     త థ ద ధ న ..........................నాలుక కొన భాగము

                     ప ఫ బ భ మ .........................పెదవులకు

                    య ర ల వ శ ష స హ ళ క్ష ఱ ..పూర్తి నోరు భాగమంతా

అయితే, ఇప్పుడు నేను, నా వాళ్లయిన అందరు తెలుగు ప్రజలు, బంధువులు, స్నేహితుల కోసం, నా చిన్నతనంలో నేర్చుకున్న 52 అక్షరాలను 'అ నుంచి ఱ' వఱకు ఆయా అక్షరాలతో ప్రారంభమయ్యే చిన్న వాక్యాలతో చిన్న పిల్లల చేష్టలను వర్ణిస్తూ, ఒక సరదా సంఘటనను సృష్టించుకొని, ఒక చిన్న కథగా చెప్పి, సంతోషపఱుస్తాను.

        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు

        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,

        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే

        (ఈ)లల గోలల మోతలతో, 

        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో

        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.

        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక

        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,

        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల

        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,

        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా

        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,

        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,

        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా

        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా

        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా

        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,

        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన

        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను

        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత

        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని, 

        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి

        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి

        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు. 

        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు

        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,

        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు

        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,

        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

        (త)లుపులు తోసేసుకుంటూ,

        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,

        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ

        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో 

        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

        (ప)రుగు పరుగున కొందరు,

        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు, 

        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,

        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,

        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,

        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,

        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,

        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే

        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,

        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,

        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో

        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-

        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ

        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-

        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.

చదివినందులకు ధన్యవాదములు.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...